కన్నా టీడీపీలో చేరేందుకు రూట్​ మ్యాప్​ సిద్ధం చేసుకున్నారు: వైసీపీ నేత అమర్​ నాథ్​

  • విశాఖలో తన భూమిని కబ్జా చేశారన్న కన్నా ఆరోపణలు అబద్ధం
  • ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే టీడీపీలో చేరతారనిపిస్తోంది
  • పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలో తన భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని, ఆ తర్వాత  ఆ భూమి ఎవరిదన్న  విషయం తెలుసుకున్న కబ్జాదారులు వదిలి వెళ్లిపోయారని కన్నా చేసిన ఆరోపణలు కరెక్టు కాదని అన్నారు.

కన్నా వ్యాఖ్యలను చూస్తుంటే టీడీపీలో చేరేందుకు ఆయన రూట్ మ్యాప్ తయారు చేసుకుంటున్నారని అర్థమౌతోందని అన్నారు. తనకే కనుక అటువంటి పరిస్థితి వస్తే నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని, కన్నా చెబుతున్న విషయం నిజమే అయితే, మరి, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అని ప్రశ్నించారు.

ఏ భూమి అయితే కబ్జాకు యత్నించారని కన్నా చెబుతున్నారో, ఆ విషయమై ఏ పోలీస్ స్టేషన్ లో అయినా కన్నా ఫిర్యాదు చేశారేమోనని సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడామని, అలాంటిదేమీ లేదని వారు చెప్పారని అన్నారు. కేవలం వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకే కన్నా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం ఇష్టం లేకనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Gudivada Amarnath
YSRCP
Kanna Lakshminarayana
BJP

More Telugu News